విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష.. స్పీకర్ బరిలో డీఎంకే

  • డీఎంకే సీనియర్ నేత ఆర్.శక్కరపాణిని అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం
  • అన్నాడీఎంకేలోని అసంతృప్తిని అనుకూలంగా మార్చుకునే వ్యూహం
  • మంగళవారం జరగనున్న స్పీకర్ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి
తమిళనాడులో నూతనంగా కొలువుదీరిన నటుడు విజయ్ ప్రభుత్వానికి తొలి రాజకీయ సవాల్ ఎదురైంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే.. మంగళవారం జరగనున్న స్పీకర్ ఎన్నికను అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికార తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వానికి పోటీగా ప్రతిపక్ష ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించింది.

ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత ఆర్.శక్కరపాణిని డీఎంకే తమ స్పీకర్ అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 17వ తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభం కానుండగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. మంగళవారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను విజయ్ ప్రభుత్వ స్థిరత్వానికి తొలి పరీక్షగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇటీవలి ఎన్నికల తర్వాత తమిళనాడు అసెంబ్లీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. డీఎంకే 59 స్థానాలతో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించగా, అన్నా డీఎంకే 47 సీట్లతో మరో ముఖ్య ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే, ఎన్నికల ఓటమి తర్వాత పళనిస్వామి నాయకత్వంపై అన్నాడీఎంకేలో అసంతృప్తి నెలకొందన్న ప్రచారం జరుగుతోంది. స్పీకర్ ఎన్నికల సమయంలో కొందరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ లేదా ఓటింగ్‌కు గైర్హాజరయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ బలాన్ని పరీక్షించాలని డీఎంకే వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.

అధికార టీవీకే పార్టీకి సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలు బయటి నుంచి మద్దతు ఇస్తున్నాయి. మరోవైపు, సీఎం విజయ్ రెండు స్థానాల్లో గెలిచి, ట్రిచీ ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో అసెంబ్లీలో ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Vijay
Tamil Nadu Assembly
DMK
Speaker Election
Tamilaga Vetri Kazhagam
TVK
MK Stalin
R Sakkarapani
Tamil Nadu Politics

More Telugu News